ఇటీవల ములకలచెరువు (Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan Rao), జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao)లపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నాలుగు రోజుల కస్టడీ మంజూరైన నేపథ్యంలో, విచారణలో పలు సంచలన అంశాలు బయటపడ్డాయని సమాచారం.
మద్యం తయారీకి రాజకీయ అండ..
తాజా సమాచారం ప్రకారం.. కస్టడీలో ఉన్న జనార్ధన్ రావు మూడోరోజు విచారణలో నకిలీ మద్యం తయారీకి స్థానిక టీడీపీ నాయకులు, కొంతమంది అధికారులు అండగా ఉన్నారని ఒప్పుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రతి నెల వారికి మామూలు రూపంలో డబ్బులు అందజేసినట్టు వివరించాడని సమాచారం. ఒక క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.18 నుండి రూ.25 వరకు ఖర్చవుతుందని, ఆ మద్యం బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లకు సరఫరా చేసినట్టు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
వైన్ షాపుల్లో నకిలీ బాటిళ్ల విక్రయం
జనార్ధన్ గ్యాంగ్ తయారు చేసిన ఈ మద్యం బాటిళ్లు బెల్ట్ షాపుల్లో రూ.55 నుంచి రూ.60కి అమ్ముడయ్యాయని, తరువాత వైన్ షాపులు, బార్లు వాటిని బ్రాండ్ పేర్లతో రూ.99 నుండి రూ.140 వరకు విక్రయించినట్టు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, ఏలూరు, కృష్ణా జిల్లాలోని బార్లు, వైన్ షాపులు ఈ గ్యాంగ్ నుండి సరఫరా పొందినట్లు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు వేగం పెంచిన ఎక్సైజ్ శాఖ
ఈరోజు ఎక్సైజ్ అధికారులు నిందితుల వాంగ్మూలాల ఆధారంగా మద్యం పంపిణీ వ్యవహారం, ఆర్థిక లావాదేవీలను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ వెనుక మరిన్ని రాజకీయ నాయకులు ఉన్నారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు త్వరలోనే మరిన్ని అరెస్టులు, ఆస్తుల సీజ్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.








