పాకిస్తాన్ రాజధాని (Pakistan Capital) ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ (United States-Iran) శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ‘‘హార్ముజ్ జలసంధి’’ (Strait of Hormuz) ని మూసేయడానికి యూఎస్ నేవీని (US Navy) దింపారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే, ఈ పరిస్థితుల్లో మళ్లీ చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తన డిమాండ్లపై సిద్ధంగా ఉంటే త్వరలో చర్చలు ప్రారంభించవచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.
అయితే, ఈ సమావేశాలు జరిపే వేదికపై చర్చ జరుగుతోంది. మొదటి విడత చర్చలు జరిగిన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో లేదా స్విట్జర్లాండ్ (Switzerland) లోని జెనీవా (Geneva) వేదికగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇస్లామాబాద్లో 21 గంటల పాటు చర్చలు కొనసాగినా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం ముందడుగు పడినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మాట్లాడుతూ.. ఇరాన్ చర్చల్లో కొంత వరకు అమెరికా వైపు వచ్చిందని, కానీ పూర్తిస్థాయిలో ఒప్పందాలు కాలేదని చెప్పారు. కొన్ని విషయాల్లో మంచి పురోగతి సాధించిందని, ఇది సరిపోదని అన్నారు. ఈ చర్చల్లో అమెరికా తరుపున జేడీ వాన్స్ పాల్గొంటే, ఇరాన్ తరుపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమాలు, ఆంక్షలు, హార్మోజ్ జలసంధిపై విభేదాలు ఉన్నాయి.








