ఇరాన్ (Iran), అమెరికా (America) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.
వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.
ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం (Kharg Island) చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.








