తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సైరన్ మోగించింది. మధ్యరాత్రి మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులు సమ్మెలోకి దిగారు. నిన్న ప్రత్యేక కమిటీ TGSRTC JAC, సంఘాలతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ రవాణాలో ఆర్టీసీ బస్సులు పాత్ర కీలకం. సమ్మె ప్రభావంతో మధ్య రాత్రి నుంచి బస్సులు రోడ్కెక్కలేదు. తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేదే లేదంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ TGSRTC JAC నేతలను చర్చలకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు.. అద్దె బస్సులు మాత్రం యథావిధిగా నడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు, పలువురు రాజకీయ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. సమ్మెకు CPI సంపూర్ణ మద్దతు ప్రకటించింది. “ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. ఆగిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలి. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను తక్షణమే కొనుగోలు చేయాలి. కార్మికుల ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యం.” కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.








