విజయవాడ లోక్సభ సభ్యుడి తీరు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనానికి కేంద్రబిందువైంది. సిట్టింగ్ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చుట్టూ అవినీతి ఉచ్చు రోజురోజుకూ బిగుస్తోంది. అటు అధికార పార్టీలోనూ, ఇటు బయటా ఆయనపై వస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు కోట్లకు తిరువూరు ఎమ్మెల్యే టికెట్ బేరం పెట్టడం దగ్గర నుంచి గంజాయి, పేకాట శిబిరాలు, మట్టి, ఇసుక దోపిడీ, ఉద్యోగాల పేరిట వసూళ్లు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అక్రమాల వరకు.. చిన్ని ‘అవినీతి ఆరోపణల చిట్టా’ పెరిగిపోయింది.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ మోసాలను బహిర్గతం చేస్తుండటం ఒకెత్తయితే.. ఆయన సొంత అన్న, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని వరుస ఆధారాలతో తమ్ముడి అవినీతి భాగోతాలను బట్టబయలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ చిన్ని చేసినట్లు చెప్తున్న రూ. 350 కోట్ల భారీ మట్టి కుంభకోణంపై కేశినేని నాని నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
రూ. 350 కోట్ల పోలవరం కెనాల్ మట్టి స్కామ్
కేవలం 5 క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు నామమాత్రపు అనుమతి తీసుకుని, ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా పోలవరం కెనాల్ మట్టిని అక్రమంగా కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ సంపదను, ప్రకృతి వనరులను నిలువునా దోచేస్తూ రూ. 350 కోట్ల మేర మనీలాండరింగ్కు పాల్పడ్డారని కేశినేని నాని ఆధారాలతో సహా ఈడీకి ఫిర్యాదు చేశారు. పోలవరం కాలువ గట్లు పూర్తిగా తవ్వేయడంతో చుట్టుపక్కల గ్రామాలకు పెను ముప్పు పొంచి ఉందని స్థానికులు వణికిపోతున్నారు.
తెరవెనుక ‘బినామీ’ నెట్వర్క్..
ఈ స్కామ్ కు సూత్రధారి ఎంపీ కేశినేని చిన్ని అని నాని ఆరోపించారు. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పక్కా ప్లానింగ్, వ్యవస్థీకృత బినామీ నెట్వర్క్ నడిచినట్లు లేఖలో పేర్కొన్నారు. మొదట మట్టి తవ్వకాలు జరిపిన మిస్టర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్. మట్టి మాఫియాను క్షేత్రస్థాయిలో నడిపించిన ముల్పూరి కిషోర్, దాసరి జగదీష్, పోలవరపు సుకుమార్, కళ్యాణ్. భారీ టిప్పర్లతో అహోరాత్రులు మట్టిని తరలించిన చిట్టిబాబు, బుడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టిన ఎంపీ చిన్ని పర్సనల్ క్యాషియర్ కోదాడ రమేష్ అని మాజీ ఎంపీ కేశినేని నాని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘ఫ్లాట్ నెం. 301’
గురునానక్ కాలనీలోని ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్ నెం. 301 కేంద్రంగానే ఈ మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీలన్నీ నడిచాయని సంచలన ఆధారాలనె మాజీ ఎంపీ బయటపెట్టారు. వెంటనే ఈ ఫ్లాట్పై ఈడీ దాడులు జరగాలని డిమాండ్ చేశారు. ఈ మట్టి మాఫియా దోపిడీ కేవలం ఆర్థిక నేరాలకే పరిమితం కాలేదు, అరాచకాలకు కూడా తెరలేపింది. కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఈ అక్రమ తవ్వకాలను, మట్టి తరలింపును ధైర్యంగా ప్రశ్నించిన సామాజిక కార్యకర్త జమలయ్యపై మట్టి మాఫియా ముఠా దారుణంగా దాడికి తెగబడిందన్నారు.
లోకేష్ అండతోనే.. ‘చిన్ని’పై చర్యలు లేవా?
సొంత తమ్ముడి అవినీతిపై కేశినేని నాని ఆధారాలు బయటపెడుతున్నా.. కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం అధిష్ఠానం కానీ సిట్టింగ్ ఎంపీపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతోనే అధిష్ఠానం మౌనం వహిస్తోందని, చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
MASSIVE ₹350CR SCAM EXPOSED!
— Kesineni Nani (@kesineni_nani) June 23, 2026
Sent an official complaint to the @dir_ed
demanding a PMLA probe into Vijayawada MP Kesineni Chinni’s organized “Matti Mafia “
From a minor 5k cubic meter permit, over 2 LAKH cubic meters of Polavaram Canal soil was illegally plundered and… pic.twitter.com/urF3i5Og8M








