తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ‘‘తమిళ భాషను ఎంతగా అధ్యయనం చేసినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’ అని వ్యాఖ్యానించారు. క్రైస్తవ మతం తనకు ప్రేమ, శాంతి, కరుణ వంటి విలువలను నేర్పిందని తెలిపారు. తాను బైబిల్ చదివానని, పుట్టుకతోనే క్రైస్తవుడినని చెప్పిన విల్సన్.. తన ప్రాధాన్యత తమిళ భాషపై విమర్శలు చేయడం కాదని, తమిళ పాలన, రాష్ట్ర అభివృద్ధి అంశాలేనని స్పష్టం చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మాట్లాడటంలో అభ్యంతరం లేదని, అయితే తమిళ భాషను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. తమిళాన్ని మతంతో పోల్చడం, మతం కంటే తక్కువగా చూపించే ప్రయత్నం చేయడం తగదని పేర్కొంటూ విల్సన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరో బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ, ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
మరోవైపు, బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళాన్ని సరిగా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ విమర్శించారు. భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా తమిళంలో మాట్లాడాలని సూచించారు. ఇదిలా ఉండగా, తమిళ బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు మంత్రి విల్సన్ క్రాస్ గుర్తు గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా వివాదాన్ని మరింత పెంచింది. దీంతో మంత్రి వ్యాఖ్యలు, మత విశ్వాసాలు, తమిళ భాషపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.








