అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, సాగర్ అదానీ తదితరులపై నమోదైన క్రిమినల్ కేసును శాశ్వతంగా (‘విత్ ప్రిజుడీస్’) కొట్టివేసింది. 2024లో సోలార్ కాంట్రాక్టుల విషయంలో భారత అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. అయితే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో, కేసును కొనసాగించకూడదని అమెరికా న్యాయశాఖ నిర్ణయించడంతో జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ కేసును అధికారికంగా డిస్మిస్ చేశారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంతర్జాతీయ కేసుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈ వివాదంలోకి లాగుతూ టీడీపీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారంపై ఇప్పుడు తీవ్ర విశ్లేషణలు సాగుతున్నాయి.

అదానీ కేసు తెరపైకి వచ్చిన కొత్తలో టీడీపీ మీడియా ఏమాత్రం సంయమనం పాటించలేదు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, ప్రజల్లో ఆయనపై తప్పుడు అభిప్రాయాన్ని కల్పించేలా పూంకాను పూంకాలుగా కథనాలు వడ్డించింది. కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ ఆధారాలు లేని ఆరోపణలతో ప్రసారాలు నడిపింది.
అదానీ అంశాన్ని కేవలం వ్యాపార కోణంలో చూడకుండా, దాన్ని వైఎస్ జగన్కు ఆపాదించి రోజువారీ డిబేట్లు, ప్రత్యేక కథనాలతో హోరెత్తించారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా, ఆయనపై నిందలు మోపేలా పక్కా ప్రణాళికతో ప్రసారాలు సాగిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. మీడియా కథనాలను ఆధారంగా చేసుకొని టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి జగన్పై అనేక ఆరోపణలు చేశారు.
అమెరికా కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో, అసలు ఈ కేసు లేని పక్షంలో జగన్పై ఓ పథకం ప్రకారం ప్రసారాలు నడిచాయన్న నిజం రూడీ అయ్యింది. ఈ నేపథ్యంలో రాజకీయ, మీడియా విశ్లేషకుల నుంచి కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైఎస్ జగన్పై రోజుకో కట్టుకథ అల్లీ, ఆయనపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించిన టీడీపీ మీడియా.. ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తన తప్పును బహిరంగంగా ఒప్పుకుని క్షమాపణలు చెబుతుందా? కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక నాయకుడిని బద్నామ్ చేయడానికి చేసిన తప్పుడు ప్రచారానికి ఆ మీడియా సంస్థలు నైతిక బాధ్యత వహిస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు.
‘ఇదొక పొరపాటని’ సరిపెట్టుకుంటారా? తాము చేసిన అసత్య ప్రచారాన్ని ఎడిటోరియల్ పొరపాటుగా జమకట్టి మళ్లీ మౌనంగా దాటవేస్తారా? లేక దీనిపై కూడా కొత్త కోణంలో వక్రీకరణలు మొదలుపెడతారా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో మీడియాకు అత్యంత బాధ్యతాయుతమైన స్థానం ఉంటుంది. కానీ ప్రత్యర్థులను దెబ్బతీయడమే అజెండాగా సాగే దుష్ప్రచారాలు ఎంతోకాలం నిలవవని అదానీ ఉదంతం మరోసారి రుజువు చేసింది. మరి ఈ తరుణంలోనైనా టీడీపీ మీడియా తన పద్ధతి మార్చుకుంటుందా లేక పాత పాటనే పాడుతుందా అనేది వేచి చూడాలి.








