భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్వదేశీ క్రికెట్ సీజన్కు క్యాంపా, ఎస్బీఐ లైఫ్, చాట్జీపీటీ సంస్థలను అసోసియేట్ పార్ట్నర్లుగా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం రెండు సీజన్ల పాటు కొనసాగనుండగా, భారత్–వెస్టిండీస్ సిరీస్తో ప్రారంభమై 2028 మార్చి వరకు అమల్లో ఉండనుంది. ఈ మూడు భాగస్వామ్యాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుందని తెలిపింది. గత భాగస్వామ్య సైకిల్తో పోలిస్తే తాజా డీల్ విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. పానీయాలు, బీమా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగాలకు చెందిన ఈ మూడు సంస్థలతో భాగస్వామ్యం ద్వారా భారత క్రికెట్కు మరింత వాణిజ్య విలువ, బ్రాండ్ రీచ్ లభించనుందని బీసీసీఐ పేర్కొంది. విస్తృతమైన అభిమాన వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా బ్రాండ్లు తమ ప్రచారాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ భాగస్వామ్యాలపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా సంతోషం వ్యక్తం చేశారు. భారత స్వదేశీ క్రికెట్ సీజన్ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని మిథున్ మన్హాస్ అన్నారు. గత సైకిల్తో పోలిస్తే భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరగడం భారత క్రికెట్పై ప్రముఖ బ్రాండ్లు ఉంచుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడు సంస్థలు విభిన్న రంగాలు, బ్రాండ్ లక్ష్యాలతో భాగస్వాములుగా రావడం ఆసక్తికరంగా ఉందన్నారు. మరోవైపు దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. రూ.130 కోట్లకు పైగా విలువైన తాజా ఒప్పందాలతో 44 శాతం వృద్ధి సాధించడం బీసీసీఐ, టీమిండియాపై బ్రాండ్లకు ఉన్న విశ్వాసాన్ని, భారత క్రికెట్కు ఉన్న మార్కెట్ డిమాండ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోందని తెలిపారు.








