ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు (శుక్రవారం) పలు విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF), ఎన్ఎస్యూఐ (NSUI), పీడీఎస్యూ (PDSU), ఏఐఎఫ్డీఎస్ (AIFDS), ఏఐఎస్బీ (AISB), ఏఐపీఎస్యూ (AIPSU) తదితర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరపాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని, VBSA బిల్లును వెనక్కి తీసుకోవాలని, అలాగే నీట్ పరీక్షల్లో జరిగిన వరుస వైఫల్యాలు, పేపర్ లీక్ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆందోళనలో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగరంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమం మరింత ఉధృతం కావచ్చని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.








