చంద్రబాబు ‘స్కిల్’ లాయర్‌కు మరోసారి భారీ నిధులు

చంద్రబాబు 'స్కిల్' లాయర్‌కు మరోసారి భారీ నిధులు

చంద్ర‌బాబు స్కిల్ స్కామ్ కేసు(Chandrababu Skill Scam Case)లో వాదించి ఆయ‌న్ను బెయిల్‌పై విడిపించిన సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌కంగా మారారు. రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా కాంట్రాక్టర్లు హైకోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. సిద్దార్థ లూథ్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని (Public Funds) ఫీజుల(Fees) రూపంలో కట్టబెడుతోంది. న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఫీజుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. 20 నెలల కాలంలో చంద్ర‌బాబు ప్రభుత్వం ఆయనకు దాదాపు రూ.10.87 కోట్ల మేర ఫీజులు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి చెల్లించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆ ఒక్క‌రోజే రూ.1.15 కోట్లు విడుద‌ల‌
ప్ర‌భుత్వం త‌ర‌ఫున కోర్టుకు హాజ‌ర‌వుతున్న సిద్ధార్థ్ లూథ్రాకు తాజాగా ఈరోజు మ‌రో రూ.33 ల‌క్ష‌లు విడుద‌ల చేస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం (Chandrababu Government) ఉత్త‌ర్వులిచ్చింది. గ‌తేడాది నవంబర్ 24న ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వుల ద్వారా లూథ్రాకు ఏకంగా రూ.1.15 కోట్లు విడుదల చేయడం గమనార్హం. సాధారణంగా ఒక రోజు కోర్టుకు హాజరైనందుకు జీఎస్టీతో కలిపి సుమారు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు.

వైసీపీ నేతలే టార్గెట్.. ఖజానా నుంచి పేమెంట్!
ప్రభుత్వం తరపున లూథ్రా వాదిస్తున్న కేసులన్నీ దాదాపుగా వైసీపీ నేతలపై నమోదైనవే కావడం ఇక్కడ విశేషం. ప్రధానంగా మంగళగిరి టీడీపీ ఆఫీస్ దాడి కేసులో రూ.1.25 కోట్లు, చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులో రూ.60 లక్షలు, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో రూ.10 లక్షలు, రఘురామ కృష్ణంరాజు (డిప్యూటీ స్పీకర్) కేసులో రూ.65 లక్షలు చెల్లించారు. తాజాగా మ‌ద్యం కేసులో కోర్టుకు నాలుగుసార్లు హాజ‌రైనందుకు క్ల‌ర్స్ చార్జీల‌తో క‌లిపి రూ.33 ల‌క్ష‌లు విడుద‌ల చేసింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. ఈ 20 నెల‌ల కాలంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధార్థ్ లూథ్రాకు సుమారు రూ.10.87 కోట్లు చెల్లించిన‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి.

వ్యక్తిగత లాయర్ నుంచి ప్రభుత్వ లాయర్ వరకు..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case), ఫైబర్ నెట్ (FiberNet Case), అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో లూథ్రా వ్యక్తిగత న్యాయవాదిగా వ్యవహరించారు. అప్పట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా బాబు కోసం వచ్చిన లూథ్రా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం త‌ర‌ఫున‌ ప్రతినిధిగా మారిపోయారు. తిరుమల లడ్డూ వివాదం, మార్గదర్శి కేసు, సునీత (వివేకా కేసు) తరపున వాదనలు.. ఇలా ప్రతి కీలక కేసులోనూ లూథ్రాకే ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రజాధనం దుర్వినియోగమేనా?
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే కేసుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఒక్క న్యాయవాదికే ధారపోయడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ చెల్లింపులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందన్న విమర్శలు వస్తున్నప్పటికీ, వీటికి ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా నిధులు వెచ్చించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment