‘కాంతారా చాప్టర్ 1’ (Kantara Chapter 1) తో సూపర్ సక్సెస్ అందుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)… తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన విషాద ఘటనపై తాజాగా స్పందించారు. ఇటీవల కరూర్ (Karur)లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్(Vijay) నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై రిషబ్ శెట్టి మాట్లాడుతూ, ఇది ఒక్కరి తప్పు కాదని, దీనిని “సమష్టి తప్పిదం” (Collective Mistake) గా పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ.. “మన దేశంలో హీరో అభిమానులు తమ అభిమాన నటుడిని దేవుడిలా చూసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమయోచిత జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదాలు తప్పవు. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, పెద్ద ఎత్తున జరిగే సమావేశాలను నియంత్రించడం కష్టం. మనం పోలీసులను లేదా ప్రభుత్వాన్ని సులభంగా నిందించవచ్చు. వారికి బాధ్యత ఉంది. కానీ కొన్నిసార్లు వారు గుంపును నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు నిజంగా దురదృష్టకరం” అని అన్నారు.
ఘటన, పరిహారం వివరాలు
ఈ తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేదికకు కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 30,000 మంది చేరుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. బాధిత కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి ₹20 లక్షల పరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి ₹2 లక్షలు అందజేశారు.








