జనసేన సాధక్ల సమావేశంలో (Jana Sena Sadhaks Meeting) వైసీపీని(YSRCP) ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు” అంటూ ఆయన చేసిన తీవ్ర ఆరోపణలపై రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా గట్టిగా డిప్యూటీ సీఎంను నిలదీస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ హితవు పలుకుతున్నారు.
ఆ 30 వేల మంది మహిళలు ఎక్కడ?
ఎన్నికల (Elections) ప్రచార సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ (Women Missing) అయ్యారంటూ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణను ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడారు. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఆ 30 వేల మందిలో కనీసం 30 మంది మహిళలైనా ఎక్కడున్నారో కనిపెట్టి వెనక్కి తీసుకురాగలిగారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసం వైసీపీపై పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని అర్థమైందంటున్నారు.
- మరి మీ పార్టీ నేతలపై చర్చలేవీ..?
- మహిళల రక్షణ (Women Protection) గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల వ్యవహారాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
- జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారంలో బాధితురాలిపై నడిరోడ్డుపైనే జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర (Tatamshetty Nagendra) పోలీసుల లాఠీలతో దాడికి తెగబడితే డిప్యూటీ సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- తిరుపతిలో జనసేన కీలక నాయకుడు కిరణ్ రాయల్ (Kiran Royal) ఒక వివాహితపై చేసిన దాష్టీకం, వేధింపుల ఉదంతంలో బాధితురాలికి జరిగిన న్యాయం ఏంటి?
- సొంత పార్టీ పరిధిలో మహిళలపై జరుగుతున్న ఇటువంటి అరాచకాలను పక్కనబెట్టి, ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

మహిళా సంక్షేమం.. పవన్కు తెలియదా?
వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళల రక్షణ, ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల (అమ్మఒడి(Amma Vodi), చేయూత(Cheyutha), ఆసరా(Aasara), కాపు నేస్తం (Kapu Nestham) తదితర) ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా రూ. 2,73,756 కోట్ల లబ్ధి చేకూరిందని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే నిరుపేద మహిళల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను (House Site Pattas) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, వారిని ఇంటి యజమానులను చేశారు. మహిళల తక్షణ రక్షణ కోసం ‘దిశ యాప్’ను తీసుకురావడంతో పాటు, ప్రత్యేకంగా ‘దిశ పోలీస్ స్టేషన్లను'(Disha Police Stations) ఏర్పాటు చేసి శాంతిభద్రతల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేశారని గుర్తుచేస్తున్నారు.

ఇంతటి స్పష్టమైన రికార్డులు, గణాంకాలు కళ్లముందు కనిపిస్తున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటిని విస్మరించి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ పాత అవాస్తవాలనే వల్లిస్తున్నారంటూ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న నాయకులు వాస్తవాలను మాట్లాడాలని, బురదజల్లే రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలుకుతున్నారు.








