పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం (Construction) చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై రాజ్యసభలో ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి (Raj Bhushan Choudhary) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1లో 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టేందుకు రూ.30,436 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం రూ.12,621 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్ర గ్రాంట్ కింద మరో రూ.12,157 కోట్ల నిధులు బ్యాలెన్స్గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
41.15 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే 17,982 మంది నిర్వాసితులను ఇప్పటికే తరలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా మొత్తంగా 96,660 కుటుంబాలు నిర్వాసితులు కానున్నట్లు వివరించారు. నిర్వాసితులకు పునరావాసం, పునరావాస ప్యాకేజీ (R&R) కింద ఇప్పటివరకు రూ.1,373 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. అలాగే పునరావాసం, పునరావాస పనుల కోసం రూ.1,581 కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్రం రాజ్యసభకు (Rajya Sabha) తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. తాజా లిఖితపూర్వక సమాధానంతో(Written Reply) ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చినట్లైంది.







