‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ప్రభుత్వ వెబ్సైట్లు, కీలక మౌలిక వసతులు, రక్షణ రంగ సేవలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడిన కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును ముమ్మరం చేసింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు (RC-01/2025/NIA/AMD)లో భాగంగా కోర్టు సెర్చ్ వారెంట్లతో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్లోని ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టి, అతడిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు, హ్యాకర్లతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ విచారణ కొనసాగుతోంది.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో దేశ భద్రతకు సంబంధించిన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగం, ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 54 అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేయడంతో పాటు DDoS దాడుల ద్వారా వాటిని స్తంభింపజేసేందుకు కుట్ర జరిగినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ప్రభుత్వ సైబర్ నెట్వర్క్కు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో మూడు ల్యాప్టాప్లు, ఐదు మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, వారికి సాంకేతిక సహకారం అందించినట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై దర్యాప్తులో భాగంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.








