భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ క్రికెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టింది. జూనియర్ క్రికెట్ కమిటీలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కమిటీ అండర్-22 స్థాయి వరకు భారత జట్ల ఎంపిక, యువ ప్రతిభను గుర్తించడం, కెప్టెన్ల ఎంపిక, కోచ్లు, సహాయక సిబ్బంది నియామకం వంటి కీలక బాధ్యతలను నిర్వహించనుంది.
దరఖాస్తు చేసుకునేందుకు 2026 సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను షార్ట్లిస్ట్ చేసి, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేపట్టనుంది. జూనియర్ క్రికెట్ కమిటీ సభ్యులుగా దరఖాస్తు చేసుకునే వారు మాజీ క్రికెటర్లు అయి ఉండటంతో పాటు కనీసం 25 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి.
అలాగే క్రికెట్కు రిటైర్ అయి కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే క్రికెట్ కమిటీలో ఐదేళ్ల పాటు పనిచేసిన వారు ఈ పదవులకు అర్హులు కారు.
కొత్త కమిటీ ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ పోటీల్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలను పరిశీలించి ప్రతిభావంతులను గుర్తించడం, అండర్-22 వరకు భారత జట్లను ఎంపిక చేయడం, కెప్టెన్లు, కోచ్లు, ఫిజియోలు, ట్రైనర్లు, విశ్లేషకులు, వైద్య సిబ్బంది వంటి సహాయక బృందాలను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ఉపయోగపడేలా బలమైన రిజర్వ్ బెంచ్ను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. అలాగే డ్రగ్స్, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అంశాలపై యువ క్రికెటర్లకు అవగాహన కల్పిస్తూ క్రమశిక్షణ, క్రీడా నైతిక విలువలను పెంపొందించడంపైనా దృష్టి సారించనుంది. ఇదిలా ఉండగా, రాబోయే దేశీయ సీజన్ కోసం కొత్త టైటిల్ స్పాన్సర్ను ఎంపిక చేసేందుకు కూడా BCCI ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఐడీఎఫ్సీతో ఉన్న ఒప్పందం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం బోర్డు అన్వేషణ చేపట్టింది. అయితే బీసీసీఐ అంచనాలకు అనుగుణంగా తగిన ప్రతిపాదన ఇంకా ఖరారు కాకపోవడంతో కొత్త టైటిల్ స్పాన్సర్పై తుది నిర్ణయం పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.








