నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోని మరుగుదొడ్డిలో విగతజీవిగా కనిపించడం స్థానికంగా సంచలనం రేపుతోంది.
అసలేం జరిగింది?
ట్రాక్టర్ దొంగిలించారనే ఆరోపణతో కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన వెంకటసుబ్బయ్య, తేజ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం స్టేషన్లోనే ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున వెంకటసుబ్బయ్య కాలకృత్యాల కోసం స్టేషన్లోని మరుగుదొడ్డికి వెళ్లాడు.
అయితే, ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన మరో నిందితుడు తేజ.. మరుగుదొడ్డి తలుపును బలంగా తోశాడు. అక్కడ వెంకటసుబ్బయ్య తన లుంగీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వెంకటసుబ్బయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసుల వేధింపులే కారణమా?
వెంకటసుబ్బయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విచారణ పేరుతో పోలీసులు వెంకటసుబ్బయ్యను తీవ్రంగా కొట్టారని, ఆ అవమానాన్ని, మనస్తాపాన్ని తట్టుకోలేకే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితుడి తరపు వారు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పోలీసుల వేధింపుల వల్ల జరిగిన మరణమేనని ప్రచారం జరుగుతోంది. తమపై వస్తున్న ఆరోపణలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన జరగడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.








