హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిపై ఆమెను విధులకు తీసుకెళ్తున్న క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ డ్యూటీకి వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్లోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
విధులకు వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని మళ్లించిన డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడు పట్టుబడతాననే భయంతో క్యాబ్తో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటన అనంతరం బాధితురాలు వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల సహాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే మహిళా ఉద్యోగినిపై ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఈ ఘటనను ఎయిర్పోర్ట్ అధికారులు అత్యంత సీరియస్గా తీసుకుని, ముఖ్యంగా మహిళా సిబ్బంది రవాణా భద్రతపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అదనపు రక్షణ చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.








