హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్లో(Madhapur) ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) ఉద్యోగిని భారతి ముఖి (Bharathi Mukhi) మృతి చెందిన రోడ్డు ప్రమాదం కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 16న జరిగిన ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోగా.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్కు(Andhra Pradesh) చెందిన జనసేన(Jana Sena) రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్(Lingamaneni Ramesh) కుమారుడు లింగమనేని సంజుష్ను (Lingamaneni Sanjush) పోలీసులు నిందితుడిగా గుర్తించారు. ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలపై మాదాపూర్ పోలీసులు BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.
ఆగస్టు 16న మధ్యాహ్నం ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో భారతి ముఖిని Aston Martin కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారు వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంటిపేరు, తండ్రి పేరు లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం సంచలనంగా మారింది.
ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు అయినప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నాలుగు రోజుల తర్వాత విస్తృతంగా వెలుగులోకి రావడం చర్చకు దారితీసింది. ఏపీలో అధికార కూటమి పార్టీ ఎంపీ కుమారుడు కావడంతోనే ఈ కేసులో పోలీసులు నెమ్మదిగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే పోలీసుల ప్రకారం దర్యాప్తు కొనసాగుతోంది.
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో నిందితులపై పోలీసులు(Police) వేగంగా చర్యలు తీసుకుంటారని, మరి ఈ కేసులో మాత్రం ఎందుకు ఆలస్యం జరిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ప్రభావం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో కేసు విషయంలో ప్రత్యేక వెసులుబాటు లభించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీలో అధికార పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఉండవల్లి కరకట్ట ఇల్లు (Undavalli Karakatta House) లింగమనేని రమేష్దే కావడం గమనార్హం.
ఇదే సమయంలో సంజుష్ను ప్రమాదం జరిగిన రోజే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కారు స్వాధీనం చేసుకుని మద్యం, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు కూడా సమాచారం.
ఈ ప్రమాదం బయటకు రాకుండా చేయడానికి డబ్బుతో వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో, కొన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రమాదం గురించి ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చారని, డబ్బులు ఇస్తామంటూ ప్రసారాలు ఆపాలని కోరినట్లు ఓ ప్రముఖ యూట్యూబ్ న్యూస్ ఛానల్ బహిరంగంగా ప్రకటన చేసింది.
జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడి కుమారుడు ఈ కేసులో నిందితుడిగా ఉండటంతో.. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దీనిపై ఎలా స్పందిస్తారన్న చర్చ కూడా మొదలైంది. మహిళల భద్రత(Women’s Safety), మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తరచూ ప్రస్తావించే పవన్.. ఈ ఘటనపై కూడా స్పష్టమైన వైఖరి వెల్లడించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.
ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడు డబ్బు, పరపతి ఉన్న కుటుంబానికి చెందినవారైనా చట్టం ముందు సమానంగా వ్యవహరించాలన్నదే ఇప్పుడు ప్రధాన డిమాండ్గా మారింది.









