మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. పార్టీ క్రమశిక్షణ రేఖను ఎవరైనా దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మల్లు రవి అన్నారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరైనా పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో పార్టీ లక్ష్మణ రేఖను దాటకూడదని సూచించారు.
కొండా సుస్మిత వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని మల్లు రవి తెలిపారు. అన్ని వివరాలను పరిశీలించిన అనంతరం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని వెల్లడించారు. ‘‘పార్టీ లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత కొండా సుస్మితపై చర్యలు తీసుకుంటాను’’ అని మల్లు రవి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య తలెత్తిన వివాదాలను గతంలోనూ చర్చల ద్వారా పరిష్కరించామని మల్లు రవి గుర్తుచేశారు. షబ్బీర్ అలీ, కొండా మురళి మధ్య వివాదం తలెత్తిన సమయంలో వారితో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.







