ఒకే ఒక్క మీటింగ్.. వంద కుట్రలా..?

ఒకే ఒక్క మీటింగ్.. వంద కుట్రలు!

కాకినాడ జిల్లా (Kakinada District) వెంకటాయపాలెంలో (Venkatayapalem) జరిగిన ‘కాపుల సామాజిక సమావేశం’ (Kapu Community Meeting) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం(TDP), దానికి మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ(Jana Sena Party) వర్గాల్లో ఈ మీటింగ్ పెను ప్రకంపనలు సృష్టించింది. వయా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ద్వారా తన వైపునకు తిప్పుకున్న కాపు ఓటు బ్యాంకు (Vote Bank) ఇప్పుడు తమ నుంచి వెనకడుగు వేస్తోందనే స్పష్టమైన సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Nara Chandrababu Naidu) తీవ్రంగా కలవరపెడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాపు సామాజికవర్గంలో వ్యక్తమవుతున్న ఈ తీవ్ర అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని డైవ‌ర్ట్ చేయ‌డానికి చంద్ర‌బాబు కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొదటి రెండు ఎత్తుగడలు ‘తుస్సు’మ‌న్నాయా..?
కాపుల అసంతృప్తి బయటపడకుండా ఉండేందుకు ఉన్నట్టుండి, ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) రాజమండ్రి (Rajahmundry), కాకినాడలలో (Kakinada) వరుసగా రెండు సమావేశాలు పెట్టించారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎవరో దూషిస్తున్నారంటూ లేని అంశాన్ని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చారని చెబుతున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్‌కు, వైసీపీకి(YSRCP) మధ్య మళ్లీ ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని కల్పించడానికి చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేశారని రాజ‌కీయ విశ్లేష‌కుడు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాకినాడ‌లో మాటామంతీ వంటి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోనూ.. “వైసీపీ గూండాలకు వార్నింగ్ ఇస్తున్నా” అంటూ పవన్ కళ్యాణ్ వేలు చూపి హెచ్చరించినా.. ఇదంతా చంద్రబాబు ‘డైవర్షన్ పాలిటిక్స్’లో భాగమేనని భావించిన వైసీపీ సంయమనంతో తన స్పందనను వ్యక్తంచేసింది. “పవన్ కుటుంబాన్ని ఎవరు తిట్టారు? దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చూపాలి” అంటూ వైసీపీ గట్టిగా నిలదీయడంతో చంద్రబాబు వేసిన తొలి రెండు ఎత్తుగడలూ పూర్తిగా పారలేదు సరేకదా ‘తుస్సు’మన్నాయంటున్నారు.

‘ప్రశ్న రావణ్’ అరెస్ట్..
ఈ క్రమంలోనే ‘ప్రశ్న రావణ్’ అనే యూట్యూబర్‌ను ఒక ప్రధాన రాజకీయ ఎలిమెంట్‌గా చూపిస్తూ అతడిపై వరుస కేసులు పెట్టించారు. అక్కడక్కడా జనసేన కార్యకర్తలను మోహరింపజేసి కోడిగుడ్లతో దాడులు కూడా చేయించారు. తద్వారా రావణ్‌ను వైసీపీ మనిషిగా చిత్రీకరించి, మళ్లీ వైసీపీకి – జనసేనకు మధ్య ఒక ‘యుద్ధ వాతావరణాన్ని’ సృష్టించాలని చూస్తున్నారన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదంతా రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన క్రాంతికుమార్, గాదె సాయికృష్ణల భయంకరమైన లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్) ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసిన ఎత్తుగడల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు రావణ్ అనే వ్యక్తి తొలి నుంచి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. రావణ్ చేసిన విశ్లేషణలు, వీడియోలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే గతంలోనే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా.. ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని, గతంలో రఘురామ కృష్ణంరాజుతో పాటు పలువురు టీడీపీ సానుభూతిపరులు కూడా అతనికి ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు ఇంతలా డైవర్షన్ రాజకీయాలు చేయడానికి అసలు కారణం కాపుల మీటింగే అంటున్నారు. కాపు సామాజికవర్గంలో అసంతృప్తి పెరిగిపోతే.. గతంలో వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ పదవుల్లో, ప్రభుత్వంలో జనసేన నాయకులకు ప్రాధాన్యతను భారీగా పెంచాల్సి వస్తుంది. కానీ ఈ మూడూ చంద్రబాబు చేయలేడని కాపులే బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ‘కాపు నేస్తం’ పథకాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంద‌ని భావ‌న వారిలో ఉంది.

కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడికే పదవి ఇచ్చి, ఆయన్ను మాత్రమే చూసుకుంటే మొత్తం కాపు సామాజికవర్గానికి న్యాయం చేసినట్టు కాదు కదా.. అది చేయలేని పక్షంలో.. ప‌వ‌న్‌ను అడ్డుపెట్టుకొని త‌ద్వారా, కాపు సామాజికవర్గంలో పవన్ కళ్యాణ్ పట్ల మళ్లీ ఒక ‘భావోద్వేగ వాతావరణం’ సృష్టించి పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు ఈ వంద కుట్రల ఎత్తుగడ వేశారనేది స్పష్టమవుతోందంటున్నారు వైసీపీ శ్రేణులు, రాజ‌కీయ విశ్లేష‌కులు.

Join WhatsApp

Join Now

Leave a Comment