ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ పదవికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన సమర్పించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ ప్రకటించినప్పటికీ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వివాదాస్పద వీడియోల వల్లే ఈ రాజీనామా ఒత్తిడి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలో ఈ రాజీనామా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు హర్షవీణ నిన్న విడుదల చేసిన వీడియోలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏకవచనంతో సంబోధిస్తూ, “సీఎం వేస్ట్” అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. కూటమి ముఖ్యమంత్రిపైనే జనసేన ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. దీంతో వెంటనే అరవ శ్రీధర్ను విప్ పదవికి జనసేన అధినేత రాజీనామా చేయించారన్న చర్చ నడుస్తోంది.
బాధితురాలి ఆరోపణలు..
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని హర్షవీణ అనే మహిళ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తోంది. ఆమె తన ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో తను సన్నిహితంగా ఉన్న కొన్ని వీడియోలను సైతం బాధితురాలు వరుసగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఓ బాధితురాలు జనసేన ఎమ్మెల్యే గురించి ఆధారాలు బయటపెడుతున్నా మౌనం వహించి, నిన్న సీఎం చంద్రబాబును అసభ్యంగా మాట్లాడి వీడియో విడుదల కాగానే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఈ వ్యవహారంలో న్యాయం అడగడానికి వెళ్లిన బాధితురాలు హర్షవీణపై నడిరోడ్డులో పోలీసుల లాఠీని లాక్కొని మరీ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దాడికి తెగబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి ఘటనపై పోలీసులు విచారణ జరిపినప్పటికీ.. సదరు నాయకుడిపై పార్టీ పరంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి పెద్దల మాటలపై ప్రజల్లో ఆగ్రహం..
“ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు.. తాట తీస్తాం” అంటూ కూటమి పెద్దలు వేదికలపై భారీ మాటలు చెబుతున్నారే తప్ప, సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంతటి వివాదాల్లో ఇరుక్కున్నా, మహిళపై దాడి జరిగినా ఇప్పటివరకు జనసేన పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం విప్ పదవి రాజీనామాతో ఈ వివాదం సర్దుమణిగిస్తారా..?లేక ఎమ్మెల్యేపై జనసేన అధినేత తదుపరి చర్యలేమైనా తీసుకుంటారా అనేది వేచి చూడాలి.









ఇది ‘రాజకీయ గూండాయిజం’.. ప్రొ.నాగేశ్వర్రావుకు ప్రకాష్ రాజ్ మద్దతు