కూటమి ప్రభుత్వం (Alliance Government)పై ప్రజావ్యతిరేకత తీవ్రమవుతుందని గమనించిన మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) తన స్పీడ్ పెంచారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి, వ్యవహరిస్తున్న తీరును చూసి, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలను చూసి, జంకుబొంకు లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని జగన్ వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకునేలా క్యాడర్ (Cadre) ను సమాయత్తం చేస్తున్నారు మాజీ సీఎం. ఇప్పటికే పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలతో 12 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. ఇవాళ తాడేపల్లి (Tadepalli)లో వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్, పార్లమెంట్ అబ్జర్వర్స్తో మీటింగ్ నిర్వహించి కీలక ఆదేశాలిచ్చారు.
వైసీపీ క్యాడర్ నిత్యం ప్రజల్లో ఉండేలా ఒక కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 9న నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శనతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపిన జగన్.. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా “రచ్చబండ” (“Rachabanda”) కార్యక్రమం చేపడుతున్నట్లుగా ప్రకటించారు.
ప్రతి గ్రామంలోనూ మెడికల్ కాలేజీ (Medical Colleges)లను ప్రైవేటుపరం (Privatization) చేయడం వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలని సూచించారు. ఆ తరువాత మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన లెటర్ కాపీలను కూడా గ్రామంలో గ్రామ కమిటీలు, అనుంబంధ సంఘాల అధ్యక్షులకు ఇవ్వాలన్నారు.
ఒకవైపు గ్రామాల్లో సంతకాల సేకరణ జరుగుతూనే ఉంటుంది, మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కొనసాగించనున్నారు. ప్రతి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణ కార్యక్రమాలను పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు.
అక్టోబర్ 28వ తేదీన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేయాలి. ఏదో ఒక నియోజకవర్గంలో వైఎస్ జగన్ తాను కూడా పాల్గొంటానని చెప్పారు. నవంబర్ 4వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందచేయాలని క్యాడర్కు జగన్ సూచించారు.
అక్టోబర్ 10వ తేదీన ప్రారంభించిన సంతకాల సేకరణను పూర్తి చేసి, గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు అందచేయాలి. అక్కడి నుంచి ఈ సంతకాలను ఫ్లాగ్ఆఫ్ చేసి, జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి విజయవాడకు లారీల్లో కోటి సంతకాల పత్రాలను తరలించాలి. నవంబర్ 12వ తేదీన నాతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కలిసి గవర్నర్ని కలిసి కోటి సంతకాలతో కూడిన పత్రాలను అందచేయనున్నారు. రాష్ట్రంలో కోటి మంది ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని గవర్నర్కు వివరిస్తారు..
కల్తీ మద్యం వ్యవహారంపై కూడా వైసీపీ పరంగా నిరసనలు తెలియచేయాలని జగన్ సూచించారు. కల్తీ మద్యం వద్దు.. మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఒక నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డ్లతో ఆందోళనలు కూడా జరగనున్నాయి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిని చేయనున్నారు. నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది.








