హైదరాబాద్లోని (Hyderabad) గుర్రంగూడ ఎకో పార్క్లో (Eco Park) వనమహోత్సవ కార్యక్రమాన్ని (Vanamahotsavam Programme) ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), హైడ్రా (HYDRAA)పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగా హైడ్రాను భూతంలా చిత్రీకరిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా (HYDRAA) ఎప్పుడూ పేద ప్రజల జోలికి వెళ్లదని, ప్రభుత్వ భూములను (Government Lands) ఆక్రమించి కోట్లాది రూపాయల ఆస్తులను కబ్జా (Illegal Occupation) చేస్తున్న పెద్ద పెద్ద భూకబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గుర్రంగూడ ఎకో పార్క్ను కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకుని 424 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు వెల్లడించారు.
అదే సమయంలో దేవాలయాలకు (Temples) చెందిన భూములను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్న వారిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రభుత్వ భూములపై కన్నేసే వారి “వీపులు సున్నం చేస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూసీ నది పునరుజ్జీవనం, పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ వంటి కార్యక్రమాలు భవిష్యత్ హైదరాబాద్ కోసం చేపడుతున్న చర్యలేనని పేర్కొన్నారు. ఢిల్లీ తరహా కాలుష్య సమస్యలు హైదరాబాద్ను వెంటాడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, నగరాన్ని పచ్చగా, స్వచ్ఛంగా, సురక్షితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.








