శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే కీలక రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు గట్టి హెచ్చరికతో కూడిన ప్రేరణాత్మక సందేశం ఇచ్చాడు. కొలంబోలోని ఎన్సీసీ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న భారత జట్టు ఆగస్టు 7 నుంచి 9 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగా, అనంతరం గాలేలో జరిగే తొలి టెస్టుకు సిద్ధమవుతుంది. బీసీసీఐ టీవీతో మాట్లాడిన గంభీర్.. “మన ముందున్న సవాలు అందరికీ తెలుసు. గతం కంటే ఎక్కువగా శ్రమించాలి. ఆగస్టు 15 ఉదయం నుంచి బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా ప్రత్యర్థి విసిరే ప్రతి సవాల్కు మన దగ్గర సమాధానం ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే అన్ని అంశాల్లో అత్యుత్తమంగా సిద్ధం కావాలి” అంటూ ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తిని నింపాడు.
అదే సమయంలో భారత టెస్టు జట్టులోకి కొత్తగా ఎంపికైన ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్, యువ పేసర్ ఆకిబ్ నబీకి గంభీర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్కు స్వాగతం పలుకుతూ ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్లో విజయం ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా స్పిన్కు అనుకూలించే శ్రీలంక పిచ్లపై భారత జట్టు ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.








