రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లోని లూలూ మాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు మారుతి, ఎస్కెయన్, సంగీత దర్శకుడు తమన్తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హాజరయ్యారు. అభిమానుల భారీ కోలాహలం మధ్య రెండో పాటను విడుదల చేశారు. అయితే పబ్లిక్ ఈవెంట్ కావడంతో అభిమానుల తాకిడి ఎక్కువై తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈవెంట్ను ముందుగానే ముగించాల్సి వచ్చింది.
ఈవెంట్ అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కారువద్దకు చేరుకునే సమయంలో ఆమెను తాకేందుకు కొందరు ప్రయత్నించడంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు హద్దులు దాటుతూ సివిక్ సెన్స్ మరిచిపోతున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుల పట్ల గౌరవంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








