రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ, ఫలితాలపై వస్తున్న అవకతవకల ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. డీఎస్సీ అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారాలతో సహా సంధించిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పలాయనవాదం చిత్తగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీపై తొలినాళ్లలో క్రెడిట్ తీసుకున్న లోకేష్.. ఈ వివాదంపై స్పందించకుండా, అధికారులతో ప్రెస్మీట్ పెట్టించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
జగన్ తన ప్రెస్మీట్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన బలమైన ఆధారాలను ప్రదర్శించారు. ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలపై సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని నిలదీశారు. అదే విధంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారంటూ, ఒక దళారీ ఉద్యోగ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడుతున్న వీడియోను బహిర్గతం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య అనే అభ్యర్థిని పక్కనబెట్టి, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
వైసీపీ నుంచి వచ్చిన ఈ బలమైన విమర్శలపై విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గానీ, క్రీడాశాఖ మంత్రి గానీ నేరుగా సమాధానం చెప్పలేకపోయారనేది అందరికీ తెలిసిందే. కనీసం ప్రెస్మీట్ పెట్టి వివరణ ఇచ్చే ధైర్యం లేక, సమాధానం చెప్పే సబ్జెక్ట్ దొరక్కనే మంత్రులు మొహం చాటేశారని, అందుకే అధికారులను స్క్రీన్ ముందుకు పంపించి చేతులు దులుపుకున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తన శాఖపై వచ్చిన ఇంత పెద్ద ఆరోపణలను సమర్థంగా ఎదుర్కోవడంలో మంత్రి విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
నాటి బొత్స ధైర్యం.. నేటి లోకేష్ వైఖరిపై చర్చ!
గతంలో వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలను రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆరోపణలు చేసినా… నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు, వివరణలు ఇచ్చేవారు. మరి అంతటి సీనియర్ నేత బాధ్యతాయుతంగా వ్యవహరించిన చోట.. నేడు ఇంతటి భారీ కుంభకోణం ఆరోపణలు వస్తున్నా లోకేష్ ఎందుకు క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు అటు నిరుద్యోగుల నుంచి, ఇటు రాజకీయ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న డీఎస్సీ పరీక్షలపై వస్తున్న కుంభకోణం ఆరోపణలపై అధికారులను మీడియా ముందుకు పంపించడం కంటే.. సంబంధిత మంత్రి వచ్చి సమాధానాలు చెబితే బాగుండేదని టీడీపీ శ్రేణులు సైతం చర్చించుకుంటున్నారు.








