భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ‘దృశ్యం’ మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా.. విడుదలకు ముందే హాట్ టాపిక్గా మారింది. తాజాగా ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని డిజిటల్ ఫార్మాట్ల ఎక్స్క్లూజివ్ హక్కులు తమవేనని ప్రైమ్ వీడియో ప్రకటించింది.
‘దృశ్యం’ సిరీస్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఈ డీల్ను కుదుర్చుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ చిత్రాలు ప్రైమ్ వీడియోలో భారీ ఆదరణ పొందడంతో మూడో భాగాన్ని కూడా అదే ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని మేకర్స్ ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది. మోహన్లాల్ మరోసారి ‘జార్జ్కుట్టి’ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత 30 నుంచి 35 రోజుల గ్యాప్తో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దర్శకుడు జీతు జోసెఫ్ సిద్ధం చేస్తున్న ట్విస్టులు, క్లైమాక్స్పై ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.








