దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి దారుణ ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై కదులుతున్న స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని మైన్పురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక నోయిడాలో ఉంటున్న తన బంధువును కలిసేందుకు బయలుదేరింది. అయితే ప్రయాణ సమయంలో భారీ వర్షం, చీకటి కారణంగా ఆమె పొరపాటున గ్రేటర్ నోయిడాలోని ‘పరీ చౌక్’ వద్ద బస్సు దిగిపోయింది. వర్షంలో ఒంటరిగా చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అటుగా ఖాళీగా వస్తున్న ఒక స్లీపర్ బస్సు కనిపించింది.
తాము నోయిడా సెక్టర్-63 వైపు వెళ్తున్నామని నమ్మించిన బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ బాలికను బస్సు ఎక్కించుకున్నారు. బస్సు కదిలిన కొద్దిసేపటికే కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించగా, ప్రతిఘటించిన బాలికపై ఇద్దరూ కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరికీ కనిపించకుండా బస్సు బెర్త్లకు ఉన్న కర్టెన్లను అడ్టుపెట్టుకుని, పరీ చౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు దాదాపు 47 కిలోమీటర్ల దూరం కదులుతున్న బస్సులోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాలికను రింగ్ రోడ్డులోని కశ్మీరీ గేట్ ISBT సమీపంలో వదిలిపెట్టి పరారయ్యారు.
భయాందోళనకు గురైన బాధితురాలు తేరుకుని నేరుగా కశ్మీరీ గేట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఉత్తర ఢిల్లీలోని తిమర్పూర్ బస్సు పార్కింగ్ ప్రాంతంలో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో కీలక ఆధారాల కోసం బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్) నిహారిక భట్ తెలిపారు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించగా, నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.








