నటుడు, విద్యానికేతన సంస్థల యజమాని.. డాక్టర్ మోహన్ బాబు యూనివర్సిటీలో 3వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి మండలం రంగంపేటలోని యూనివర్సిటీలో ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు అధ్యక్షతన, ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం వివిధ అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 3,517 మంది విద్యార్థులకు వారి విద్యకు సంబంధించిన పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ వాటర్కలర్ కళాకారుడు పరేష్ మైథిలకు మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.
గొప్ప వ్యక్తులకు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్లు అందించడం ఎంతో సంతోషంగా ఉందని మోహన్ బాబు అన్నారు. విద్యార్థులు యూనివర్సిటీలో పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తమ జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యను అందించిన గురువులను ఎప్పటికీ మరచిపోకూడదని మంచు విష్ణు సూచించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులతో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అన్నారు.








