గంజాయి రవాణాకు (Ganja Transportation) కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు దుండగులు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా.. రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒడిశా (Odisha) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి రవాణాను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కూరగాయల ట్రేల (Vegetable Trays) కింద చాకచక్యంగా దాచిన 400 కిలోల గంజాయిని ముత్తంగి (Muthangi) ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఔటర్ రింగ్ రోడ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాన్ని ఆపారు. తనిఖీల్లో కూరగాయల లోడుతో పాటు గంజాయి ప్యాకెట్లు బయటపడటంతో అందరూ షాక్కు గురయ్యారు.
ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ (DCP Srinivas) తెలిపారు. నిందితులు ఒడిశాలోని సరఫరాదారుల నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.








