దేశంలో ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రెండేసి అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామాతో ఖాళీ అయిన అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది.
పశ్చిమ బెంగాల్లోని రెజినగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. నౌడా నుంచి కూడా విజయం సాధించిన హుమాయున్ కబీర్ రెజినగర్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి భవానిపూర్ స్థానాన్ని కొనసాగిస్తూ నందిగ్రామ్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే అంశంపై పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఆమె అసెంబ్లీలోకి తిరిగి ప్రవేశిస్తే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మరింత సమర్థవంతంగా పోరాడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్లో సువేందు అధికారి గతంలో మమతా బెనర్జీపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో.. అక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తే ఆసక్తికరమైన రాజకీయ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
రెజినగర్లో ముస్లిం ఓటర్ల శాతం అధికంగా ఉండటం కూడా తృణమూల్ కాంగ్రెస్కు అనుకూల అంశంగా భావిస్తున్నారు. అయితే మమతా బెనర్జీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఈసారి ఆమె ఉప ఎన్నికల బరిలోకి దిగుతారా? నందిగ్రామ్ను ఎంచుకుంటారా, రెజినగర్ వైపు మొగ్గుచూపుతారా? లేక అసెంబ్లీకి దూరంగా ఉంటూ తనదైన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.








