బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువరిస్తామని హైకోర్టు తెలిపిన వేళ, భగీరథ్ తరఫు న్యాయవాది ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు మెమో దాఖలు చేశారు. ఇటీవల భగీరథ్ అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్కు ప్రాధాన్యం లేకుండా పోయిందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటికే పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్లు నమోదైన భగీరథ్పై తాజాగా కీలక ఆధారాలు మాయం చేసినందుకు అదనంగా సెక్షన్ 238ను పోలీసులు జోడించారు. డిజిటల్ ఆధారాలు, పాత మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులు వంటి కీలక సమాచారాన్ని నిందితుడు తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారిగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ ప్రత్యర్థులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. “బీజేపీ కార్యకర్తలు కట్టుబాటుతో పనిచేసే వారు. నా గురించి కార్యకర్తలకు బాగా తెలుసు. నన్ను బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీలు డిమాండ్ చేయడం రాజకీయ కక్షసాధింపే” అని అన్నారు. తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే కేటీఆర్ ఫేక్ సోషల్ మీడియా ప్రచారంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.








