వైసీపీ ఎమ్మెల్యేని ఇలా ఇరికించారు.. బ‌య‌ట‌ప‌డ్డ వీడియో

వైసీపీ ఎమ్మెల్యేని ఇలా ఇరికించారు.. బ‌య‌ట‌ప‌డ్డ వీడియో

Summarize with AI

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేపిన ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిప్పగిరి మండలం నేమకల్లులో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మోపిన కేసు వెనుక అసలు ఉద్దేశం బట్టబయలైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బయటపడటంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

శ‌నివారం రాత్రి వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేత నాగ‌రాజు, అత‌ని అనుచరులు దాడి చేశారన్న సమాచారంతో ఎమ్మెల్యే విరూపాక్షి నేమకల్లు గ్రామానికి వెళ్లారు. బాధితులను పరామర్శించి, దాడికి సంబంధించి టీడీపీ నాయకుడు నాగరాజును నిలదీసేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీసిన‌ట్టుగా సంచ‌ల‌న వీడియో బ‌య‌ట‌ప‌డింది.

ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో వెళ్లి పోలీసులతో మాట్లాడుతుండగానే, టీడీపీ నేత నాగరాజు స్వయంగా తన భార్య నైటీని చించేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. భార్యతో ఎమ్మెల్యే పై తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి, ఎమ్మెల్యేనే తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసి బట్టలు చించేశారంటూ ఫిర్యాదు చేయించారు. ఎమ్మెల్యే గ్రామానికి రాగానే “డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ, తీవ్ర పదజాలంతో దూషించి నాటకీయ పరిణామాలకు తెరలేపారు.

పోలీసుల తీరుపై విమర్శలు
ఘటనపై కనీస ప్రాథమిక విచారణ చేపట్టకుండా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా సీఐ రవిశంకర్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కలకలం రేపింది.

“కట్టుకున్న భార్య నైటీని నలుగురిలో చించేసి, రాజకీయ లబ్ధి కోసం మహిళ గౌరవాన్ని పణంగా పెడతారా? ఎమ్మెల్యేను జైలుకు పంపించేందుకు మహిళలను అడ్డుపెట్టుకోవడం దారుణం” అని తెలుగుదేశం పార్టీ రాజ‌కీయంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వీడియో ఆధారాలు బహిర్గతం కావడంతో టీడీపీ నేతలు అల్లిన అబద్ధపు కథనాలు బట్టబయలయ్యాయని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment