క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న తిరుపతికి చెందిన జూ.ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశాడు. గతేడాది ‘దేవర’ సినిమా విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కౌశిక్, తన అభిమాన హీరో జూ.ఎన్టీఆర్ను కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో స్వయంగా తారక్ అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు.
కౌశిక్ డిగ్రీ చదువుతున్న సమయంలో జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించగా క్యాన్సర్ గా నిర్ధారణ అయ్యింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడంతో, కనీసం తన అభిమాన నటుడి సినిమా ‘దేవర’ విడుదలయ్యే వరకు జీవించాలని ఆకాంక్షించాడు. ఈ క్రమంలో కౌశిక్ పరిస్థితిని తెలుసుకున్న ఎన్టీఆర్, వీడియో కాల్ ద్వారా అతనితో మాట్లాడి వైద్య సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీ రూ.40 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11 లక్షలు, ఎన్టీఆర్ అభిమానులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
కొన్నాళ్ల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కౌశిక్, ఇటీవల అనారోగ్యం సమస్యలు తీవ్రమై కన్నుమూశారు. ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం వచ్చినా, ప్రత్యక్షంగా కలవాలన్న కోరిక తీరకుండానే ఈ లోకం వీడాడు. కౌశిక్ మరణం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.








