సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో కొనసాగనున్నారు.
పోసాని అరెస్ట్, రిమాండ్పై వాదనలు
పోసాని అరెస్ట్, రిమాండ్పై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదని, 41ఏ నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను తోసిపుచ్చి 14 రోజుల రిమాండ్ విధించారు.
కేసు వెనుక కారణం
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జనసేన నాయకుడు జోగినేని మణి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న రాయచోటి పోలీసులు హైదరాబాద్లోని పోసాని నివాసానికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్కు తరలించిన పోలీసు అధికారులు, న్యాయ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు