ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ముగ్గురు అధికారులపై ఆరోపణలు చేసిన జీవీరెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించినప్పటికీ, ఇందులో లోగుట్టు ఉందని, జీవీరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వేరే ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాజీనామా వెంటనే.. బదిలీ
కాగా, జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన వారిలో ఒకరైన ఐఏఎస్ దినేష్ కుమార్పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఎండీ దినేష్ కుమార్పై బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా దినేష్ కుమార్ను ప్రభుత్వం తప్పించింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డ్యామేజీ కంట్రోలా..?
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న జీవీ రెడ్డి అనూహ్యంగా రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇది కూటమి పార్టీల క్యాడర్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఫైబర్ నెట్ ఎండీని దినేష్ కుమార్ను బదిలీ చేసినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.