శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. టన్నెల్ పైభాగం అకస్మాత్తుగా కుంగిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన 14వ కిలోమీటర్ వద్ద చోటుచేసుకోగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇంకా 10 మంది టన్నెల్లోనే
మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 42 మందిని సురక్షితంగా బయటకు తరలించారు, ఇంకా 10 మంది కార్మికులు లోపలే ఉన్నారని తెలిపారు. టన్నెల్లోకి నాలుగు అడుగుల మేర నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ, అధికారులు వెంటనే పునరుద్ధరణ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను పరిస్థితిపై పూర్తిగా అవగాహన చేసుకోవాలని, సంఘటనా స్థలానికి మంత్రులను పంపాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ హెలికాఫ్టర్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
SLBC ప్రాజెక్టు 2005లో నాటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించగా, రూ.2,000 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం నేడు రూ.4,637 కోట్లకు పెరిగింది. 2019 డిసెంబర్ నుంచి మూలనపడ్డ పనులు, తాజాగా ప్రారంభమైన నాలుగు రోజులకే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. 2026 జూన్ నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.








