ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team India Jersey)ని ఆవిష్కరించింది. అయితే, ఈ జెర్సీపై ‘పాకిస్తాన్’ (Pakistan) పేరు ఉండటం అభిమానుల్లో ఒకింత ఆశ్చర్యాన్ని, ఆగ్రహన్ని తెప్పించింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కొత్త జెర్సీలను ధరించి మీడియా ముందు దర్శనమిచ్చారు. ఐసీసీ విడుదల చేసిన ఫొటోలలో ఈ జెర్సీలపై “ఛాంపియన్స్ ట్రోఫీ 2025- పాకిస్తాన్” అని కనిపించింది.
ఇది టీమిండియా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఇండియన్ జెర్సీపై పాక్ పేరును ముద్రించేందుకు మొదట బీసీసీఐ(BCCI) అంగీకరించలేదు. పాకిస్తాన్లో ఆడటం లేదు కాబట్టి ఆ దేశం పేరును ఎలా ముద్రిస్తారని బీసీసీఐ ప్రశ్నించింది. ఈ విషయంపై ఐసీసీ(ICC) జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రతీ ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్య దేశ పేరును జెర్సీపై ముద్రించడం సాధారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత జెర్సీపై పాక్ పేరు ముద్రించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.