ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హత్య నుంచి తేరుకోకముందే ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఆమదాలవలస బొబ్బిలపేట గ్రామంలో వైసీపీ కార్యకర్త (YCP Activist)ను కొందరు దుండగుల హతమార్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భయానక వాతావరణం ఏర్పడింది. రెండ్రోజుల వ్యవధిలోనే బహిరంగంగా రెండు హత్యలు జరగడంపై రాష్ట్రంలో శాంతిభద్రతల అమలు విషయం ఆందోళన కలిగిస్తోంది.
ఫీల్డ్ ఆఫీసర్ హత్య..
ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న (42) దారుణ హత్యకు గురయ్యాడు. ఐదేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అతడిని గత రెండు నెలలుగా రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఈరన్న బైక్ పై వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో అతిదారుణంగా నరికి హత్య చేశారు.
నేడు ఆమదాలవలసలో..
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస (Amadalavalasa) మండలం బొబ్బిలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గురుగుబెల్లి చంద్రశేఖర్ (47) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామం అట్టుడికిపోయింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి కనిపించడం లేదని చంద్రయ్య భార్య ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో చంద్రశేఖర్ మృతదేహం గుర్తించారు. చంద్రశేఖర్ తల, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రామస్థుల కథనం ప్రకారం, హతుడు వైసీపీకి చెందిన కార్యకర్త. బొబ్బిలిపేట సర్పంచ్గా పోటీచేశారు. గ్రామ శివారులో చంద్రశేఖర్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
నిన్న జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్, ఇవాళ జరిగిన వైసీపీ కార్యకర్త చంద్రశేఖర్ హత్యల్లోనూ పదునైన ఆయుధానాలను ఉపయోగించారు. దారుణంగా, అతికిరాతకంగా నరికి చంపినట్లుగా నిర్ధారించబడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను సైతం ఉద్యోగం వదిలేయాలని టీడీపీ నేతలు బెదిరించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు విపరీతం అయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.