ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షను ఇంటర్నల్గానే నిర్వహించాలని, బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించబోతోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు ఈనెల 26 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా కొత్త విధానానికి ఆమోదం పొందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ను ప్రవేశపెట్టనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్ధులకు సమాన శిక్షణను అందించడానికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం లేదని ప్రభుత్వం చెబుతోంది.