ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వలన హైందవ ధర్మానికి జరిగిన, జరుగుతున్న నష్టాల గురించి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.
హైందవ ధర్మంపై చంద్రబాబు ప్రభావం
గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు మృత్యువాతపడినా, పురంధేశ్వరి తన మౌనం వీడలేదు. విజయవాడలో 50 ఆలయాలు కూల్చివేయడం పట్ల ఆమె స్పందించలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసరమైన ఆరోపణలు చేసేందుకు ఆమె ముందు వరుసలో ఉంటారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
జగన్ పాలనలో ఆధ్యాత్మిక అభివృద్ధి
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అనేక ఆలయాలు నిర్మించబడ్డాయని, అర్చకులకు వేతనాలు పెంచడంతో పాటు రిటైర్మెంట్ లేకుండా చేశారని గుర్తుచేశారు. శ్రద్ధగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొట్టు సత్యనారాయణ వివరించారు. ఆయన చెప్పినట్టు, కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీకూర్మం వంటి ప్రముఖ ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమేగాక, 49 ఆలయాల్లో ఒకేసారి కుంభాభిషేకం నిర్వహించారని, శ్రీవాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారన్నారు. ఇవన్నీ పురంధేశ్వరికి కనపడలేదా అని ప్రశ్నించారు.
సెక్షన్ 83ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు, అన్యాక్రాంతమైన భూములను కాపాడేందుకు సెక్షన్ 83ని వైఎస్ జగన్ సవరణ చేశారన్నారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయన్నారు. తిరుమల లడ్డూని అనవసరం వివాదంలోకి లాగారని, దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారన్నారు.