22ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయనుంది. కమిటీకి సీసీఎల్ఏ కమిషనర్ ఛైర్మన్గా, లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ సభ్యులుగా ఉంటారు. 118 జీవో కారణంగా తలెత్తిన సమస్యలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది.
ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే సభలో ప్రకటన చేశారని, నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించేలా గడువు విధించామని చెప్పారు. 118 జీవోతో ఏర్పడిన సమస్యలపై కూడా మెమో ఇచ్చినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతున్న భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిశీలన అనంతరం అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.








