అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే(Anantapur Urban MLA) దగ్గుపాటి ప్రసాద్ (Daggubati Prasad) వ్యవహారం మరోసారి టీడీపీలోనే(TDP) తీవ్ర చర్చకు దారితీసింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎమ్మెల్యే రూ.200 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించారంటూ సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి(Prabhakar Chowdary) బయటపెట్టడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేపై తాను ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు, పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించడం లేదని కుండబద్ధలు కొట్టేశారు.
దగ్గుపాటి ప్రసాద్ భూ వ్యవహారాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. నగరంలో ఏ స్థలం రిజిస్ట్రేషన్ (Land Registration) చేయాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, నగరం ఎవరి జాగీరు కాదని ప్రశ్నించారు. ప్రజలు స్వేచ్ఛగా భూములు కొనుగోలు, విక్రయాలు చేసుకోలేని పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి(Democracy) ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
అనంతపురంలోని కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లే వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
త్రీ టౌన్ సీఐ ఎమ్మెల్యే మాట వింటూ స్థానికులపై అక్రమ కేసులు (Illegal Cases) పెడుతున్నారని, దాడులకు పాల్పడుతున్నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దగ్గుపాటి ప్రసాద్ భూ దోపిడీలు(Land Grabbing), దాడులకు సంబంధించిన ఆధారాలతో జిల్లా అధికారులతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న డీవీ ఇన్ఫ్రా(DV Infra) సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోయినా రూ.32 కోట్ల విలువైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనులు అప్పగించారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. అలాగే నగర పాలక సంస్థలో అనేక కాంట్రాక్టులను రుద్ర కన్స్ట్రక్షన్స్ పేరుతో అధికారులను బెదిరించి దక్కించుకున్నారని ఆరోపించారు. దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్కు సంబంధించిన 200కు పైగా రికార్డులు తన వద్ద ఉన్నాయని ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఈ రికార్డులపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట వినకపోతే కేసులు పెట్టిస్తానని, అవసరమైతే గంజాయి కేసులో(Ganja Case) ఇరికిస్తానని, టిప్పర్లతో ఢీకొట్టి చంపిస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. ఈ కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బన్లో భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రతి నెలా రూ.1.50 లక్షలు ఎమ్మెల్యేకు ఇవ్వాలంటూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి అర్బన్లో పాలన ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బావమరిది అశోక్, సుందర్పై కేసులు ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేయడం లేదని కూడా ప్రభాకర్ చౌదరి ఆరోపించారు.
గతంలో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో అనంత వెంకటరామిరెడ్డి(Anantha Venkatarami Reddy), గురునాథ్రెడ్డి(Gurunath Reddy) ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించలేదని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారణంగా టీడీపీ(TDP) కార్యకర్తలపైనే అక్రమ కేసులపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.








