భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళల ఆసియా కప్ 2026 టోర్నీకి భారత మహిళల జట్టును అధికారికంగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ మరోసారి జట్టుకు కెప్టెన్గా ఎంపిక కాగా, స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుంది. షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, భారతి ఫుల్మాలీ వంటి కీలక ఆటగాళ్లకు జట్టులో స్థానం లభించింది.
అయితే గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్కు ఈసారి జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. చీలమండ లిగమెంట్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమెను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇదే గాయం కారణంగా ఇటీవల టీ20 ప్రపంచకప్ను కూడా ఆమె మధ్యలోనే వీడాల్సి వచ్చింది.
మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్ను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, టోర్నీ ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య వరకు జరిగే అవకాశం ఉంది. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు. శ్రేయాంక పాటిల్ అప్పటికి పూర్తిగా కోలుకుని ఆసియా గేమ్స్కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అనుభవజ్ఞులు, యువ ప్రతిభ కలయికతో బలంగా కనిపిస్తున్న భారత జట్టు ఈసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. రిజర్వ్ జాబితాలో ప్రతీకా రావల్, ఉమా చేత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సాత్ఘరే, మిన్ను మణి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం జట్టుకు అదనపు బలంగా మారింది. మహిళల ఆసియా కప్లో మరోసారి ఛాంపియన్గా నిలవాలనే లక్ష్యంతో టీమిండియా సన్నాహాలను ప్రారంభించనుంది.








