మేడ్చల్ జిల్లాలోని మాజీ మంత్రి మల్లారెడ్డి (CMR) కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. గత రాత్రి, లేడీస్ హాస్టల్ బాత్ రూమ్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసిన ఘటనపై విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తర్వాత, పోలీసులు చర్చలు జరిపి వివాదం సర్దినట్లు భావించినప్పటికీ, మళ్లీ ఆందోళన మొదలైంది.
నిందితులను శిక్షించాలని డిమాండ్
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా కలిసి నిరసనను తీవ్రతరం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కాలేజీ హాస్టల్లోకి ప్రవేశించడానికి యత్నించడంతో కాలేజీ యాజమాన్యం గేట్లను బంద్ చేసింది. అయినా వారు ఆగకుండా గేట్లను బద్దలు కొట్టి లోపలి ప్రవేశించి ధర్నా చేయడం ప్రారంభించారు. అనంతరం సెక్యూరిటీ రూమ్ను ధ్వంసం చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
లేడీస్ హాస్టల్లో వీడియో రికార్డింగ్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తు వేగం చేశామని చెబుతున్నారు.