బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్లో మాట్లాడినట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ప్రచారం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుండగా, అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షుడి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. షహాబుద్దీన్ తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే అధ్యక్షుడి కార్యాలయం ఈ ప్రచారాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోగా, ఖండించలేదు కూడా.
ప్రథమ్ ఆలో పత్రిక కథనం ప్రకారం, ఇటీవల లండన్ పర్యటనలో ఉన్న సమయంలో అధ్యక్షుడు షహాబుద్దీన్, ప్రవాసంలో ఉన్న షేక్ హసీనాతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 విద్యార్థి ఉద్యమం అనంతరం షేక్ హసీనా భారత్కు వచ్చి ఇక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో తిరిగి బంగ్లాదేశ్కు వెళ్తానని ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ఆరోగ్య కారణాలతో అధ్యక్షుడు రాజీనామా చేసే అవకాశముందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. హోం మంత్రి షలాహుద్దీన్ అహ్మద్ ఈ వార్తలను ఖండించకపోగా, ధ్రువీకరించలేదు కూడా. అధ్యక్షుడు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందని మాత్రమే వ్యాఖ్యానించారు. అయితే అధ్యక్షుడి రాజీనామాపై బీఎన్పీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తే, కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.







