రాష్ట్రంలో అధికారం పంచుకున్నాం.. సమాన గౌరవం దక్కుతుందని కలలు గన్న జనసేన కేడర్కు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చి ‘త్యాగాల వీరుడు’ అని పవన్ కళ్యాణ్కు కితాబిచ్చిన తెలుగుదేశం పార్టీ.. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అసలు బలం ఏంటో తేల్చి పారేసింది. “మేము చెప్పిందే ఆట.. మేము గీసిందే గీత” అన్నట్లుగా లోకేశ్ సీట్ల నిష్పత్తిని ప్రకటించడంతో జనసైనికులు నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
లోకేశ్ తాజాగా తేల్చిన 80:15:5 నిష్పత్తి కూటమిలో జనసేన అసలు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహభాగం అంటే 80 శాతం సీట్లు టీడీపీకే దక్కుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. ఇక జనసేనకు కేటాయించింది కేవలం 15 శాతం మాత్రమే.. 5 శాతం సీట్లతో బీజేపీ సరిపెట్టుకోవాలి. 21 స్థానాల్లో పోటీ చేసి 21 అసెంబ్లీ సీట్లూ గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని కాలర్ ఎగరేసిన జనసేన శ్రేణులకు.. ఈ 15 శాతం సీట్ల లెక్క మింగుడుపడడం లేదని సమాచారం. జనసేనకు కనీసం సగం సీట్లు దక్కకపోగా, ఈ స్థాయి అవమానకరమైన వాటా దక్కడంపై క్యాడర్ రగిలిపోతోంది.
సీట్ల సర్దుబాటు నారా లోకేష్ డిసైడ్ చేయడం జనసైనికులకు మరింత బాధ కలిగిస్తుందట. కనీసం ఆ మాట చంద్రబాబు నుంచి వచ్చిన బాగుండేదనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది. పార్టీ అధినేతలు డిసైడ్ చేయాల్సిన అంశాన్ని లోకేష్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
‘బలం ఉన్న చోటే పోటీ’.. నాదెండ్ల క్లారిటీ
“మనకు బలం ఉన్న చోటే పోటీ చేస్తాం” అంటూ జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇచ్చిన క్లారిటీ వెనుక అసలు ప్లాన్ వేరే ఉందనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి కొన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో జనసేన తరఫున రెబల్స్ గట్టిగా పోటీకి దిగితే అది కూటమి ఓట్లకే గండి కొడుతుందని టీడీపీ భయపడుతోంది. అందుకే టీడీపీ నేతలు వేసిన ప్లాన్కు జనసేన పెద్దలు తల ఊపేస్తున్నారని, ముందుగానే క్యాడర్ను ప్రిపేర్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు జనసేన పెద్దలు కూడా కనీసం పది మున్సిపల్ చైర్మన్ పదవులు, రెండు కార్పొరేషన్ మేయర్ పదవులు ఇస్తే చాలు అనే భావనలో ఉండడం ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
15 ఏళ్ల స్నేహం కోసం..
టీడీపీతో 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పొత్తు కొనసాగాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. కానీ, ఈ సుదీర్ఘ బంధం కోసం జనసేన తన సొంత ఉనికిని బలిపీఠం ఎక్కిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 21 సీట్లలో పోటీ చేసి ఆనాడే జనసేన త్యాగం చేసింది. స్థానిక సంస్థల్లో 15 శాతానికి అంగీకరిస్తే క్యాడర్ ఆశలను అణచివేసినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే జనసేన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతలదే పెత్తనం సాగుతోందని, తమపై దాడులు జరుగుతున్నాయని జనసైనికులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ కాపు నేతల ఆగ్రహాన్ని గానీ, సొంత క్యాడర్ ఆవేదనను గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
సొంత పార్టీ శ్రేణులకు కనీస గౌరవప్రదమైన సీట్లు కూడా దక్కించుకోలేకపోతే.. భవిష్యత్తులో జనసేన ఉనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ ఉంటుంది? లోకేశ్ చెప్పిన 15 శాతం సీట్ల సర్దుబాటును మౌనంగా భరిస్తూ.. అధిష్టానం తీరుపై లోలోపల నలిగిపోతూ, మాట్లాడలేక సణుగుతున్న జనసేన క్యాడర్ ఆవేదన ఎటు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలంటున్నారు ఆ పార్టీ సానుభూతిపరులు.








