మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు షాక్ ఇచ్చింది. ముద్రగడ మరణానంతరం ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
“బతికున్నప్పుడు గౌరవం ఇవ్వకుండా, ఇప్పుడు అధికారిక లాంఛనాల పేరుతో సానుభూతి ప్రదర్శించడం అవసరం లేదు” అంటూ కుటుంబం స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజా జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా సేవలందించిన ముద్రగడ వంటి నాయకుడికి జీవించి ఉన్నప్పుడే తగిన గౌరవం, ఆదరణ లభించలేదన్న భావనను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.
ఈ విషయంపై వైసీపీ నేత జక్కంపూడి రాజా స్పందిస్తూ, ముద్రగడ పద్మనాభం పదవుల కోసం, అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని అన్నారు. ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిని రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు గుర్తు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారిక గౌరవాల కంటే ఆయన జీవితంలో చూపాల్సిన గౌరవమే ముఖ్యమని, కుటుంబం తీసుకున్న నిర్ణయం వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ తీరుపై కొత్త చర్చకు దారితీసింది.







