తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారానికి రెండుసార్లు బ్రేక్ దర్శనం, రెండుసార్లు రూ.300 దర్శనం టికెట్లు కేటాయించేందుకు ఏపీ సీఎం ఆమోదం తెలిపారు.
తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తెలంగాణ భక్తులు తరలివస్తారు. కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరస్కరించబడడం వివాదాస్పదమైంది. టీటీడీ ఈవో శ్యామల రావు ఇటీవల చేసిన ప్రకటన తెలంగాణ ప్రజాప్రతినిధులను అసహనానికి గురిచేసింది. ఈ అంశంపై చర్చించిన టీటీడీ పాలకమండలి, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయం తెలంగాణ భక్తుల ఆందోళనలకు కొంత ఉపశమనం కలిగించనుంది.