ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, పోలీస్ శాఖను కుదిపేస్తున్న ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ కేసులో ఎట్టకేలకు తొలి అరెస్ట్ నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఆరోపణలకు కేంద్రబిందువుగా మారిన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై సంధించిన పదునైన ప్రశ్నల ట్వీట్ తీవ్ర దుమారం రేపిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ సాహసోపేత చర్యకు పూనుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైడ్రామా నడుమ సీఐ అరెస్ట్..
సీఐ నాగరాజును అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకున్నాయి. నాగరాజును అరెస్ట్ చేయడానికి వెళ్లిన సిట్ అధికారులను ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున ముట్టడించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లకుండా పోలీసులను తోసేస్తూ వాగ్వాదానికి దిగారు. అయితే సిట్ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లాఠీలతో చెదరగొట్టి లోపలికి వెళ్లారు. అరెస్ట్ అనంతరం ఏఆర్ గ్రౌండ్స్ మీదుగా సీఐ నాగరాజును విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ లోనే సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారిస్తున్నారు.
🚨 బిగ్ బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) June 23, 2026
గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్
సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన మద్దతుదారులు
పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించి సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్ బృందం https://t.co/CpQnmUUo1Z pic.twitter.com/sSDXk6QjGW
చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్..
నిన్న సాయంత్రం మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన సంచలన ట్వీట్ ఈ అరెస్టుకు ప్రధాన కారణంగా నిలిచిందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. “చంద్రబాబూ.. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, ఆయన డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నాలుగు రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటికీ ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు?” అని వైఎస్ జగన్ నిలదీశారు.
ఈ ట్వీట్తో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయిందని, హైకోర్టు గడువు (ఈనెల 29) కూడా దగ్గరపడుతుండటం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. వైఎస్ జగన్ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సీఐ నాగరాజును సిట్ అరెస్ట్ చేయక తప్పలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ పరామర్శతో కదిలిన యంత్రాంగం
గాదె సాయికృష్ణ అదృశ్యమై నెలలు గడుస్తున్నా.. ఆచూకీ చూపించకపోవడంతో ఈనెల 18న వైఎస్ జగన్ స్వయంగా బాధితుడైన గాదె సాయికృష్ణ ఇంటికి వెళ్లి, ఆయన తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారని, దీనిపై బాధిత కుటుంబానికి న్యాయపోరాటానికి వైసీపీ మద్దతు ఉంటుందని జగన్ హెచ్చరించారు.
జగన్ పరామర్శించి వెళ్లిన వెంటనే.. పోలీసులు సీఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కేసు విచారణను వేగవంతం చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణాధికారిగా నియమించారు. ఆ వెంటనే కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ రవిప్రకాష్ పర్యవేక్షణలో ‘సిట్’ (SIT) ఏర్పాటు చేశారు. జగన్ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే సీఐ నాగరాజును అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.








